జియో కస్టమర్లకు కాల్స్ కలపనందుకు... ఐడియా, వోడాఫోన్, ఎయిర్ టెల్ పై రూ. 3,050 కోట్ల జరిమానా!

  • భారీ పెనాల్టీని విధించిన డీసీసీ
  • వసూలు విషయంలో ట్రాయ్ సూచనలు తీసుకుంటామని వెల్లడి
  • కావాలనే జియోకు సహకరించలేదని తేలడంతో జరిమానా
రిలయన్స్‌ జియో నెట్‌ వర్క్‌ ను వినియోగిస్తున్న కస్టమర్లు చేసే కాల్స్‌ కు ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను సరిపడినంతగా సమకూర్చని కారణంగా ఎయిర్‌ టెల్, వొడాఫోన్‌ ఐడియా సంస్థలపై భారీ పెనాల్టీని విధిస్తున్నట్టు డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) తెలిపింది. రూ. 3,050 కోట్లను ఈ కంపెనీలపై ఫైన్ వేస్తున్నామని వెల్లడించిన డీసీసీ, ఇప్పటికే టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యలు నెలకొన్న నేపథ్యంలో, జరిమానాను సవరించే విషయంలో ట్రాయ్‌ సూచనలను తీసుకోవాలని నిర్ణయించడం ఈ కంపెనీలకు కాస్తంత ఊరటను కలిగించింది. కాగా, టెలికం రంగంలోకి 2016లో జియో ప్రవేశించగా, ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను ఇచ్చేందుకు భారతీ ఎయిర్‌ టెల్, వొడాఫోన్‌ ఐడియాలు నిరాకరించగా, అప్పట్లోనే ఈ జరిమానాకు ట్రాయ్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌ టెల్, వొడాఫోన్‌ లపై రూ. 1,050 కోట్ల చొప్పున, ఐడియాపై రూ. 950 కోట్ల జరిమానాను విధించామని డీసీసీ పేర్కొంది. తమ కస్టమర్లు చేసే కాల్స్ లో 75 శాతం ఫెయిల్ అవుతున్నాయని జియో గతంలో ఫిర్యాదు చేయగా, విచారణ జరిపించిన ట్రాయ్, చర్యలకు ఆదేశించింది. దీనిపై విచారించిన ఓ కమిటీ, ఇతర టెలికం సంస్థలు కావాలనే జియోకు కనెక్టింగ్ పాయింట్లను కేటాయించలేదని తేల్చింది.
Go Back to Shorts
DCC
Fine
Airtel
Vodafone
Idea
Train
Jio

More Telugu News